గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం :రోడ్డు ప్రమాదాల నివారణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి IPS అధికారులకు పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆధ్వర్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో ఆదివారం వెస్ట్ జోన్ పోలీస్ సమావేశ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిజిపి కి వివరించారు. అనంతరం డిజిపి మాట్లాడుతూ….ప్రస్తుత రోజుల్లో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం, నేరస్తులు ఎక్కడో ఉండి టెక్నాలజీ వినియోగించుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని కావున ప్రతి అధికారి సైబర్ నేరాలపై అవగాహన కలిగించడం ఎంతో, డీప్ ఫేక్, డార్క్ నెట్లపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం అని డిజిపి అధికారులకు సూచించారు. ప్రధానంగా స్టేషన్ అధికారులు రికార్డుల నమోదుపై దృష్టి పెట్టాలని, రౌడీ షీటర్లు, అనుమానితులను స్టేషన్ అధికారులు ప్రత్యక్షంగా వెళ్లి తనిఖీ చేయాలని ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి తన స్టేషన్ పరిధిలోని హిస్టరీ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందని రోడ్డు ప్రమాదాలపై మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రతినెల చివరివారం అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.అలాగే అక్రమంగా ఇసుక, రేషన్ బియ్యం రవాణాపై పోలీసు అధికారులు ఉక్కు పాదం మోపాల్సి ఉంటుందన్నారు.ప్రతి పోలీస్ అధికారి తన ఉద్యోగానికి న్యాయం చేసే విధంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని డిజిపి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిసిపిలు రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, దార కవిత తో పాటు ఏ.ఎస్పీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు పాల్గొన్నారు


