గ్రేటర్ న్యూస్,హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం తరుపున శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాను విస్మరించారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందిస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై పెట్టిన శ్రద్ధ రాష్ట్ర రెండవ రాజధానిగా హైదరాబాద్ కు దీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పటికీ వరంగల్ పై దృష్టి పెట్టలేదని తెలిపారు.వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులు,పరిశ్రమల ఊసే లేదని తెలిపారు. అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేని, పేదల పెన్నిది అయిన వరంగల్ ఎంజీఎంకు అవసరమైన నిధులు కేటాయించలేదని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రస్తావించకుండా మరోసారి గత ప్రభుత్వాల మాదిరిగానే నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల అర్హులైన మహిళలకు రూ. 2500 వారి ఖాతాలో జమ చేస్తామన్న హామీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. అలాగే రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా సకాలంలో అందించడం లేదని తెలిపారు. వరంగల్ నగరంలోని మురికి వాడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక బడ్జెట్ లో లేదని తెలిపారు.

