ఐనవోలు మండల కేంద్రంలో పంటల సాగుకు ఉపయోగపడే డ్రోన్ల పంపిణీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్…
గ్రేటర్ న్యూస్,ఐనవోలు :పంటల సాగులో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని, ముఖ్యంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు.గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాబార్డ్ పథకం కింద వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రైతు సేవా సహకార సొసైటీ (నందనం)కు డ్రోన్లను కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై అందజేశారు.ఈ సందర్భంగా రైతు సేవా సహకార సొసైటీ( నందనం), పిఎసిఎస్ నర్సంపేట, పిఎసిఎస్ నెల్లికుదురు లకు అందించే మూడు డ్రోన్లకు సంబంధించిన వివరాలను వ్యోమిక్ డ్రోన్స్ సంస్థ ప్రతినిధులు హనుమ, జగదీష్ జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ఒక డ్రోన్ ఎన్ని ఎకరాలలో స్ప్రే చేయగలదు, రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇచ్చారా అని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుమందులు సమర్థవంతంగా పిచికారీ చేయడంతో పాటు సమయం, ఖర్చు తగ్గుతాయని రైతులు ఈ సాంకేతికతను విస్తృతంగా వినియోగించు కోవాలని తెలిపారు. డ్రోన్లను వినియోగించుకొని పంటల ఉత్పత్తిని సాధించాలన్నారు.అదేవిధంగా రైతు సేవా సహకార సొసైటీ ( నందనం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ మార్ట్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. మార్ట్ లో విక్రయానికి సిద్ధంగా ఉన్న వివిధ రకాల వస్తువులను కలెక్టర్ పరిశీలించారు. రూరల్ మార్ట్ నిర్వహణ చాలా బాగుందని రూరల్ మార్ట్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నింగ్ రవీందర్ రావు, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, వరంగల్ అధికారి చైతన్య, హనుమకొండ, వరంగల్ జిల్లాల డిసిఓలు సంజీవరెడ్డి, నీరజ, హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఏడిఏ ఆదిరెడ్డి, సహకార శాఖ ఏరియా అధికారి జగన్మోహన్ రావు, సర్పంచులు రఘు వంశీ, రాజు, తదితరులతో పాటు రైతులు పాల్గొన్నారు.





