గ్రేటర్ న్యూస్, హనుమకొండ: ఈ నెల 14 నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నుండి డీఈవో ఎల్.వి. గిరి రాజ్ గౌడ్, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామినేషన్ భువనేశ్వరీల తో కలిసి పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ను నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ…
పదో తరగతి వార్షిక పరీక్షలకు 12079 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతారని, ఇందుకోసం 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 64 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 64 మంది సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది నియమించబడ్డారని తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాలలో తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్తు, ఫ్యాన్లు, లైట్లు వంటి సౌకర్యాలు కల్పించామని, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్ లు సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పరీక్షల సమయంలో పరీక్ష హాల్స్ పరిశుభ్రంగా ఉండేలా ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బాలురు, బాలికలకు వేరువేరు ప్రిస్కింగ్( తనిఖీ) చేపట్టాలన్నారు. ఎల్లుండి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు పూర్తిగా సన్నద్ధమై ఉండాలన్నారు. నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల ప్రాంగణంలో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండాలని అన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా పకడ్బందీగా పరీక్షల నిర్వహణ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

