గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : త్వరలో నిర్వహించబడే గ్రామ పంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులకు పిలుపు నిచ్చారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమీషనర్ అధ్వర్యంలో గురువారం వరంగల్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమీషనరేట్కు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుగా త్వరలో మూడు విడతలు జరగబోయే పంచాయతీ ఎన్నికలను సజావు నిర్వహించేందుకు గాను తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై పోలీస్ కమీషనర్ అధికారులతో చర్చించడంతో పాటు, పోలీస్ స్టేషన్ వారిగా ఎన్నికలు జరిగే గ్రామ పంచాయితీల వివరాలతో పాటు సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలు, గ్రామాల వివరాలను పోలీస్ కమీషనర్ సంబంధించిన స్టేషన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి పోలీస్ అధికారి ప్రణాళికబద్దంగా పనిచేయాల్సి వుంటుందని. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు ముందస్తూ చర్యలు తీసుకోవాల్సి వుంటుందని అన్నారు.నామినేషన్ మొదలుకొని ఎన్నికలు ముగిసే వరకు పోలీస్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంటుందని తెలిపారు.సరైన రీతిలో బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని గతంలో ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన నేరస్తులతో పాటు, ఎన్నిక సమయంలో నేరాలకు పాల్పడేవారు, పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులను బైండోవర్ చేయాలని సూచించారు. ఎన్నికలు జరిగే గ్రామాలకు పోలీస్ అధికారులు నిరంతరం సందర్శిస్తూ ఎన్నికలను సజావుగా కొనసాగేందుకుగా స్థానిక గ్రామస్తులతో సమన్వయం చేసుకోవాలన్నారు.ప్రధానంగా ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుండంతో పక్క జిల్లాల నుండి బందోబస్తు విధులు నిర్వహించేందుకు పోలీస్ సిబ్బంది రావడం వుండదని, కావున ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న పోలీస్ సిబ్బంది వినియోగించుకోని అధికారులు ఎన్నికల బందోబస్తు నిర్వహించుకోవాలని అన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలోని లైసెన్స్ కలిగిన అయుధ యజమానులు తమ తుపాకులను సమీప పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేసే విధంగా స్టేషన్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు. అనంతరం పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, నేరాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలపై పోలీస్ కమీషనర్ అధికారులతో సమీక్షా జరిపారు.ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్,రాజమహేంద్ర నాయక్, కవిత,ఏ.ఎస్పీలు శుభం, చైతన్య, అదనపు డిసిపిలు రవి,ప్రభాకర్,బాలస్వామి,సురేశ్కుమార్,శ్రీనివాస్తో పాటు ఏసిపిలు, ఇన్స్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు ఈ సమావేశంలో పాల్గోన్నారు.



