హైదరాబాదుకి దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం..
గ్రేటర్ న్యూస్, హనుమకొండ : ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.ఆదివారం రోజున నియోజకవర్గ పరిధిలోని 30, 59వ డివిజన్లలో సుమారు రూ.85 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్లకు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ… అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సీసీ రోడ్లు లేని కాలనీలను పూర్తిగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటివరకు సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు.రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గానికి సమృద్ధిగా నిధులు అందుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో వరంగల్ నగరంను హైదరాబాద్కు సమానంగా అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ కొనసాగుతుందని హామీ ఇచ్చారు.పశ్చిమ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమని, ప్రతి వర్గానికీ ప్రయోజనం చేకూరేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

