Breaking
26 Mar 2026, Thu

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష….

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై  ముఖ్యమంత్రి  ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనుల నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి, అందుకు సంబంధించిన అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగాలని చెప్పారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని సూచించారు.పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ , తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , బలరాం నాయక్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *