హసన్ పర్తి వద్ద బ్లాక్ స్పాట్స్ ను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్
– రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులకు ఆదేశం
గ్రేటర్ న్యూస్,హనుమకొండ : వరంగల్ కరీంనగర్ ప్రధాన జాతీయ రహదారిలో హసన్ పర్తి పెద్ద చెరువు కట్ట మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆ శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో వరంగల్ కరీంనగర్ మార్గంలో ఉన్న హసన్ పర్తి పెద్ద చెరువు కట్ట మూలమలుపు సమీపంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం సంభవిస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, సాగునీటి పారుదల, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ప్రమాదకరంగా ఉన్న బ్లాక్ స్పాట్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇటీవల హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ ( దిశా ) సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు హసన్ పర్తి పెద్ద చెరువు కట్ట మూలమలుపు వద్ద చోటు చేసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు, జరుగుతున్న ప్రాణ నష్టం పై ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, సంబంధిత అధికారులకు తెలియజేయగా కలెక్టర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, రోడ్డు విస్తరణకు ఉన్న అవకాశాలను ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ అక్కడికక్కడే సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ….
హసన్ పర్తి పెద్ద చెరువు కట్ట మూలమలుపు వద్ద ప్రమాదాలు చోటు చేసుకున్న బ్లాక్ స్పాట్ ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణతో ప్రమాదాలు తగ్గుతాయి కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, తహసీల్దార్ కిరణ్ కుమార్, పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు , సాగునీటిపారుదల, మున్సిపల్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

