గ్రేటర్ న్యూస్, హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని నిర్దేశిత లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం, స్థానిక అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 50వ డివిజన్ పరిధిలో రూ.1.17 కోట్ల నిధులతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ…ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి డివిజన్లో ప్రారంభించిన పనులు ఆలస్యం కాకుండా నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలిపారు.నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ABC కేటగిరీలుగా గుర్తించి ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులతో సమన్వయం చేస్తూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.ప్రస్తుతం కాజీపేటలో ROB నిర్మాణం, ఆధునిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, వరంగల్ నగరానికి ఎంతో అవసరమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) ప్రాజెక్టు, అలాగే భద్రకాళి మాడ వీధుల అభివృద్ధి వంటి కీలక పనుల అమలుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. రానున్న రోజుల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో మరింత వేగం కనిపిస్తుందని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు.డివిజన్లలో కార్పొరేటర్లు, స్థానిక నాయకత్వం ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తూ తమ దృష్టికి తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సహకారంతోనే బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలమని ఆయన పేర్కొన్నారు.అనంతరం డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని , స్థానికంగా గుర్తించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్,డివిజన్ అధ్యక్షులు అఫ్సర్ నాయకులు రాంప్రసాద్,రమేష్,వెంకన్న అధికారులు EE రవి కుమార్,DE శ్రీకాంత్,AE ప్రవళిక, కాలనీ వాసులు పాల్గొన్నారు.

