గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ IPS స్పష్టం చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సీపీ మాట్లాడుతూ..సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల వల్ల ప్రజలు ఆందోళనకు గురై ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకుంటున్నారని తెలిపారు. దీంతో అనవసర రద్దీ ఏర్పడి సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతున్నదని పేర్కొన్నారు. వరంగల్ కమిషనరేట్ అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నదని చెప్పారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

