గ్రేటర్ న్యూస్,జగిత్యాల జిల్లా (ఏప్రిల్ 30):తెలంగాణలోని అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా పేరు ఉన్న జగిత్యాల జిల్లా లోని ప్రసిద్ధి చెందిన కొండ గట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాల విశేషాలను పరిచయం చేస్తూ నీతీ ఆయోగ్ రూపొందించిన “దివ్య భారత్ ” పుస్తకం లో ఈ క్షేత్రానికి ప్రత్యేక స్థానం లభించడం విశేషం. దేశంలోని పలు రాష్ట్రాల ఆధ్యా త్మిక, సాంస్కృతిక, పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలను ఒకేచోట సమగ్రంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రూపొందించారు.
దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు భారతదేశంలోని ముఖ్యమైన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, పర్యాటక కేంద్రములపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం ఎంపిక కావడం ప్రాంతీయంగా గర్వకారణం గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాచీన, ప్రసిద్ధ ఆలయాలు ఉన్నప్పటికీ, వాటిలో కేవలం కొండగట్టు అంజన్న ఆలయానికే ” దివ్య భారత్” పుస్తకంలో చోటు దక్కడం ప్రత్యేకతగా నిలిచింది.
ప్రతి సంవత్సరం లక్ష లాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం, తన ఆధ్యాత్మిక మహిమతో పాటు సహజసిద్ధమైన కొండల మధ్య ఉన్న అందమైన పరిసరాల తో కూడా పర్యాటకు లను ఆకర్షిస్తుంది. హనుమాన్ స్వామికి అంకితమైన ఈ క్షేత్రం భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది.
స్థానిక ప్రజలు, భక్తులు ఈ గుర్తింపును ఆనందంతో స్వాగతిస్తూ, ఆలయానికి దేశస్థాయి లో మరింత గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌరవంతో కొండగట్టు అంజన్న క్షేత్రం దేశ పర్యాటక పటంలో మరింత ప్రాముఖ్యతను సంపాదించుకుంది.

