గ్రేటర్ న్యూస్, హనుమకొండ : నక్కలగుట్టలోని శ్రీ చైతన్య హైస్కూల్లో (KGBV) పరీక్ష రాసేందుకు వచ్చిన శ్రావ్య అనే విద్యార్థిని, తన హాల్ టికెట్ పోవడంతో కన్నీటిపర్యంతమైంది. జనగామ జిల్లా సూరారం గ్రామానికి చెందిన విద్యార్థి శ్రావ్య పరిస్థితిని గమనించిన కాజీపేట ట్రాఫిక్ పెట్రోలింగ్ సిబ్బంది పిసి రాజేందర్ (1415), హెచ్జి సతీష్ (321) వెంటనే స్పందించారు.పరీక్షకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంతో, వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొబైల్ ద్వారా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసి సమీపంలోని జిరాక్స్ సెంటర్లో ప్రింట్ తీయించి సకాలంలో విద్యార్థినికి అందజేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ విద్యార్థిని ఏడాది కష్టాన్ని వృథా కాకుండా కాపాడిన పోలీసుల మానవత్వాన్ని అక్కడి వారంతా ప్రశంసించారు.

