పలు ప్రాంతాలను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…
భారీ వర్షాలతో జరిగిన పంట,ఆస్తి,ప్రాణ నష్టాలపై నివేదికను సమర్పించండి…
ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలి…
వరద ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలి…
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు….
భారీ వర్షాలతో పంటలు, ప్రాణ, ఆస్తి నష్టాలపై రాష్ట్ర అధికారులు,మంత్రులు, జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్షా సమావేశం
సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధికారులు
గ్రేటర్ న్యూస్, హనుమకొండ: రాష్ట్రంలో భారీ వర్షాలతో జరిగిన పంటలు, ఆస్తి, ప్రాణ నష్టాలపై క్షేత్రస్థాయిలో అధికారులతో జిల్లాల కలెక్టర్లు సమీక్ష నిర్వహించి ఆ నివేదికలను ప్రభుత్వానికి త్వరగా అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశపు హాల్ లో భారీ వర్షాలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలసి రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… భారీ వర్షాలతో జరిగిన పంట,ఆస్తి,ప్రాణ నష్టాలపై జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి నివేదికను అందజేయాలన్నారు. భారీ వర్షాలతో జరిగిన నష్టం పై ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. పంట ఆస్తి ప్రాణ నష్టాలపై నిర్దిష్ట నమూనాలో అంచనా వేసి నివేదికను అందజేయాలన్నారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా 12 జిల్లాల్లో అధిక నష్టం వాటిల్లిందన్నారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించి జరిగిన నష్టం పై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం ఉండొద్దన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రాణ నష్టం, పంట నష్టం, పశు సంపద, అన్ని శాఖలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టానికి సంబంధించి నివేదికలు సమర్పించాలన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోలన్నారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు రిపోర్ట్ అందజేయాలన్నారు.తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని,కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను .కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో అలసత్వం వద్దని, కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకుంటుందన్నారు.
తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అధికారుల మధ్య ఏర్పడిన సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయని,
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నాలాల కబ్జాలను తొలగించాల్సిందే.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పది మంది కోసం పదివేలమందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దన్నారు.
దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.
వరదలు తగ్గిన నేపథ్యంలో శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, వరదల్లో ప్రాణ నష్టం జరిగినచోట రూ. 5 లక్షలు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇందుకు సంబధించిన వివరాలు సేకరించాలన్నారు.
పంటనష్టం, పశు సంపద నష్టపోయిన చోట వారికి పరిహారం అందించాలని, ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకునేందుకు అంచనాలు వేయాలన్నారు.ఇండ్లు మునిగిన వారికి ప్రతీ ఇంటికి రూ.15 వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.
ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని,ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దన్నారు. క్షేత్రస్థాయిలో ఒక కో-ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలని, వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైందని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
అధికారులు నిర్లక్ష్యం వదలి క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు.
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై సమగ్ర నివేదికలను వీలైనంత త్వరగా జిల్లాల కలెక్టర్లు అందజేయాలన్నారు. రాష్ట్రంలో ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఆదుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వరదలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై నిబంధనలను మేరకు నిర్ణీత నమూనాలో వివరాల నివేదికను అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ…తుఫాను కారణంగా సంభవించిన భారీ వర్షంతో జిల్లాలో జరిగిన పంట, ఆస్తి ప్రాణ నష్టాల గురించి ముఖ్యమంత్రి, మంత్రులకు వివరించారు. జిల్లాలో 229.6ఎంఎం వర్షపాతం కురిసిందని దీంతో వరి పంటతోపాటు పత్తి, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు భారీ వర్షానికి దెబ్బతిన్నాయని తెలియజేశారు. వరదలతో ముగ్గురు మృతి చెందారని, పశు సంపద 10072 నష్టం జరిగిందని, వరి పంట 33 348 ఎకరాలు, పత్తి 750 ఎకరాలు,మోక్కజొన్నా 650 ఎకరాల్లో పంట దెబ్బతిన్నాయని అన్నారు. పలుచోట్ల ఇండ్లకు నష్టం జరిగిందన్నారు. భారీ వర్షం కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన ఇండ్లు, విద్యాసంస్థల నుండి ప్రజలు విద్యార్థులను సురక్షితంగా పునరావాస కేంద్రాలు, ఇతర విద్యాసంస్థలకు తరలించినట్లు తెలియజేశారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ…కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో జరిగిన నష్టం గురించి ముఖ్యమంత్రి, మంత్రులకు వివరించారు.
పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లో 378, 318 మిల్లి మీటర్ల వర్షం కురిసింది అని వరంగల్ పట్టణంలోని ఖిలా వరంగల్, వరంగల్ మండలాల్లో 368, 271 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసిందన్నారు.78 ప్రాంతాలు గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్ జిల్లాకు సంబంధించిన 35 ప్రాంతాలు, జలామయమయ్యాయని, 8 పునరావాస కేంద్రాలకు 1170 బాధితులకు తలలించామని జరిగిందన్నారు. జిల్లాలో 58,730 ఎకరాల్లో వరి, 16,420 ఎకరాల్లో పత్తి, 30 ఎకరాల్లో మొక్కజొన్న, 643 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు పూర్తిగా నష్టం వాటిలిందని, జిడబ్ల్యూ ఎంసీ ప్రాంతాల్లో నష్టం, జిల్లాలో పంట నష్టం మొత్తం కలిపి 573. 07 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేయడం జరిగిందన్నారు . భారీ వర్షాల వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని, 102 గొర్రెలు, 200 లైఫ్ స్టాక్ నష్టం జరిగిందని, ఒక ఇల్లు పూర్తిగా 66 ఇండ్లు పాక్షికంగా నష్టం వాటిలిందన్నారు. 50 ఆర్ అండ్ బి రోడ్లు 10 కాజువేలు 13 పి ఆర్ రోడ్స్ ధ్వంసమయ్యాయని అన్నారు.
జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ… గ్రేటర్ వరంగల్ లో భారీ వర్షాలకు జరిగిన నష్టం వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ , వరంగల్ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయినందువల్ల ఇలా మూడు ప్రధాన చెరువుల నుండి వరద నీటితో పాటు సమీపంలో గల ఎల్గురూ రంగంపేట చెరువు వరదనీరు చేరుకోవడం వల్ల వరంగల్ మహానగరంలోని 78 కాలనీలు నీట మునిగాయన్నారు 1560 మంది వరద బాధితులకు 45 కేంద్రాలకు సురక్షితంగా తరలించి వారికి నిత్యావసరాలను అందించడం జరిగిందన్నారు నగరంలోని ఎనిమిది ట్రాఫిక్ జంక్షన్ లకు అంతరాయం కలిగిందన్నారు.
ఈ సందర్భంగా భారీ వర్షాల వల్ల ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో జరిగిన వివిధ పంటలు, ఆస్తి ప్రాణ నష్టాలు గురించిన ఆ జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, హైమావతి ముఖ్యమంత్రికి వివరించారు.
ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు…
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాల ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టం, చేపట్టిన సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలలో బాధితులకు అందిస్తున్న సహాయం, వరద ప్రాంతాల్లో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు సందర్శించి సహాయక చర్యలు చేపట్టిన ఫోటోలను ప్రదర్శించగా సీఎం, మంత్రులు పరిశీలించారు.
అంతకుముందు
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏరియల్ సర్వే అనంతరం హనుమకొండ, వరంగల్ నగరాల పరిధిలో వరద ప్రభావ కాలనీ లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేశారు. హనుమకొండ, వరంగల్ కాలనీల పరిశీలన అనంతరం ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దిగారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ లు సమ్మయ్య నగర్ లో వరద ప్రభావంతో నీట మునిగిన ఇండ్లను పరిశీలించి స్థానికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జరిగిన నష్టం పై స్థానికులను సీఎం అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. అక్కడే నాలా వంతెన వద్ద వరదకు దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వరదతో జరిగిన నష్టాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. అదేవిధంగా కాపువాడలో వరద ప్రభావం బారీన పడిన బాధిత కుటుంబాలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోతన నగర్ లో వరద ముంపు బాధితులతో సీఎం ప్రత్యక్షంగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. సమ్మయ్య నగర్, కాపు వాడ, పోతన నగర్ ప్రాంతాల సందర్శన అనంతరం హనుమకొండ కలెక్టరేట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు.
హనుమకొండ కలెక్టరేట్ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి చేరుకోగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ వర్ధంతి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి లను పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సమీక్షలో రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య శాసనసభ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్రు నాయక్, వరంగల్ మహబూబాబాద్ ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కె.ఆర్. నాగరాజు, రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, పశు సంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఐజి చంద్రశేఖర్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, కరీంనగర్, సిరిసిల్ల మహబూబాబాద్, జనగామ జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, అద్వైత్ కుమార్ సింగ్, రిజ్వాన్ భాషా షేక్, గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశం అనంతరం హనుమకొండ కలెక్టరేట్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వద్ద హెలిప్యాడ్ కు చేరుకున్నారు. హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హైదరాబాద్ కు బయలుదేరి వెళుతుండగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వీడ్కోలు పలికారు.







