హనుమకొండ కలెక్టరేట్ లో ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం…
గ్రేటర్ న్యూస్,హనుమకొండ: ప్రజా రవాణాలో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం వంద ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని, బస్సుల నిర్వహణ కోసం ప్రతిపాదిత స్థలాన్ని త్వరగా అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఆర్టీసీ, రెవెన్యూ శాఖల అధికారులతో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం మడికొండలో ప్రతిపాదిత స్థలం, నిర్వహణ అంశాలకు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ… ప్రభుత్వం కేటాయించిన వంద ఎలక్ట్రిక్ బస్సులు గ్రేటర్ వరంగల్ పరిధిలో నడుస్తాయన్నారు. మడికొండలో ప్రతిపాదిత ఐదెకరాల స్థలాన్ని ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా హనుమకొండ చౌరస్తా బస్ బే అభివృద్ధి చేయడంపై ఆర్టీసీ, కుడా అధికారులతో ఈ సందర్భంగా చర్చించారు. కాజీపేటలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ అంశాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్ ఎం భాను కిరణ్, మధు, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, ఆర్టీసీ డిఎం ధరమ్ సింగ్, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

