గ్రేటర్ న్యూస్, వరంగల్ : నిబద్ధత క్రమశిక్షణ సంస్కారవంతమైన భాషతో చేసే రచననే గేయమని, సాహిత్య ప్రక్రియలలో పాట చాలా గొప్పదని ప్రముఖ సినీగేయ రచయిత మౌనశ్రీమల్లిక్ అన్నారు. శనివారం వరంగల్ హంటరోడ్లోని సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞానపీఠంలో తెలుగు సినిమా గేయరచన సదస్సు మరియు పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నోముల రాజు సంపాదకత్వంలో వెలవరించిన సినీగేయ వ్యాస సంకలనం గేయపరిమళాలు పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ మేరకు జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్యఅతిధిగా సినీగేయ రచయిత మౌనశ్రీమల్లిక్, విశిష్ట అతిధులుగా కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంతచార్యులు పంతంగి వెంకటేశ్వర్లు, ప్రముఖ గేయరచయిత, జానపద గాయకులు పత్తిపాక సురేందర్, కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు గోవిందం లక్ష్మినర్సయ్య పాల్గొని ప్రసంగించారు. మౌనశ్రీమల్లిక్ మాట్లాడుతూ పాట ఒక చైతన్య కెరటమని, ఒక్కపాట కోట్లాది మందిని సమూహంగా చేయగలదని, కోట్లాది సమూహాలను ఒక్క పిడికిలిగా చేయగలదని పేర్కొన్నారు.. విద్యార్ధుల దృష్టి పాటల వైపు మరల్చిన పుస్తకసంపాఠకుడు నా ఆత్మీయ సోదరుడు డాక్టర్ నోముల రాజును అభినందిస్తున్నానని అన్నారు. పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న మాట్లాడుతూ… విద్యార్థులు భాష సరళిని, రచన విధానాన్ని మెరుగుపరుకోవడం’ ద్వారా ఆర్ధికపరమైన అవకాశాలు అందుకోవచ్చునని అన్నారు. పీఠం ఆధ్వర్యంలో జానపద, గిరిజనుల పాటలను సేకరించి భద్రపరచడం జరిగిందని, పాటల పుస్తకాన్ని కూడా వెలువరించడం జరిగిందని గుర్తుచేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంతచార్యులు పంతంగి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… గేయరచన అనేది ఒక అవధానం లాంటిదేనని అన్నారు. గేయరచయిత, జానపద గాయకులు పత్తిపాక సురేందర్ మాట్లాడుతూ…. పాట రచనలో అక్షరాల పొందిక క్రమపద్ధతిలో ఉండాలని అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు గోవిందం లక్ష్మినర్సయ్య మాట్లాడుతూ పూర్వం పాటల కోసమే సినిమాలు చూసేదని, మంచి పాట ఉంటే నలభైసార్లు సినిమా చూసినవారు ఉన్నారని, పాటలలో కష్టసుఖాలు, సమాజంలోని లోటుపాట్లు, జీవనస్థితిగతులను కూడా జోడించి వివరించడం హర్షించదగిన విషయమని అన్నారు. అనంతరం నోముల రాజు అతిధులను సన్మానించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఆమేర్ అలీఖాన్, పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ బాసాని సురేష్, డాక్టర్ చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, డాక్టర్ సునీత, టెక్నికల్ అసిస్టెంట్ డాక్టర్ గంపా సతీష్, బుక్బేరర్ సిద్దోజు సునంద, సిబ్బంది ఆంజనేయులు, ఆశోక్, సులోచన, కస్తూరిబాయి, విద్యార్థులు పాల్గొన్నారు.

