గ్రేటర్ న్యూస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విధంగానే దివ్యాంగులకి కూడా ఆర్ టి సి బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరుణహరి శేషు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంద్రధనస్సు పథకం ద్వారా దివ్యాంగులకి కూడా ఆర్ టి సి బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని అభిప్రాయబడినారు. మహిళలు వికలాంగులతో పాటు విద్యార్థులకి కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసినారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మేరకు వృద్ధులకి ₹4,000 వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ కూడా పెంచకపోవడం ప్రభుత్వం ఆయా వర్గాలను మోసం చేసినట్లేనని విమర్శించారు. ఇప్పటికే ప్రభుత్వం వృద్ధులకి వికలాంగులకి 52 వేల రూపాయలు బాకీ పడిందని అభిప్రాయపడినారు. ప్రభుత్వం ఇప్పటికైనా దివ్యాంగులకి పెన్షన్ పెంపుతో పాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

