అందెశ్రీ అంత్యక్రియలు పూర్తి…
గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ పార్థివ దేహాన్ని మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి వారికి నివాళులర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి అంతిమయాత్రలో పాల్గొని అశ్రునివాళి అర్పించారు.
▪️ అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి అందెశ్రీ పాడె మోశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. మొదట లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ ఎన్ఎఎఫ్సీ నగర్ వరకు అంతిమ యాత్ర సాగింది.
▪️ అందెశ్రీ సతీమణి మల్లుబాయి , కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయం పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్ర కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు.
▪️ సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జూపల్లి కృష్ణారావు , ధనసరి అనసూయ సీతక్క , పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , కేశవరావు , పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.





