గ్రేటర్ న్యూస్,వరంగల్ క్రైం : ప్రతి వాహనదారుడు తన వ్యక్తిగత బాధ్యతగా గుర్తించి బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగం రెండవ రోజైన మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని హన్మకొండ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపిఎస్ కె. ఆర్. నాగరాజు వరంగల్ పోలీస్ కమిషనర్, ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని స్థానిక యువత చేత ప్రమాణం చేయించారు. ప్రతి ఒక్కరం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, యువత వేగంగా వాహనాలు నడపటం తో పాటు మద్యం సేవించి వాహనం నడపటం ప్రమాదకరమని, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు తమ వంతు సహకారం అందించాలని వర్ధన్నపేట శాసనసభ్యులు యువతకు సూచించారు.ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…దేశంలో ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య తీవ్రస్థాయిలో ఉందని, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య, ప్రస్తుతం జరిగిన హత్యల సంఖ్య కన్న తొమ్మిది రెట్లు అధికమని ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాల్లో అధికంగా ఎంతో భవిష్యత్తు వున్న యువత మరణిస్తున్నారన్నారు . ఇందుకు ప్రధాన కారణం యువత వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడపడమేనని, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ” నో హెల్మెట్ నో ఎంట్రీ ” నినాదంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకై చేపట్టాల్సిన చర్యలు గ్రామాల్లో గ్రామస్తులు తీర్మానాలు చేసుకోవడoతో పాటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 451గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా తమ గమ్యస్థాలకు చేరుకోవాలని సీపీ తెలిపారు. అంతకు ముందు పోలీస్ కమిషనర్ తో పాటు, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ట్రాఫిక్, హన్మకొండ ఏసీపీ లు సత్యనారాయణ, నర్సింహారావు, ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, హన్మకొండ, సుబేదారి, కేయుసి ఇన్స్ స్పెక్టర్లు శివకుమార్, రంజిత్ కుమార్, రవికుమార్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

