గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శుక్రవారం హైదరాబాద్ లోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వరంగల్ వైద్య రంగ అభివృద్ధికి సంబంధించి పలు ముఖ్య అంశాలపై సీఎం చర్చించారు.ఇటీవల వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజిఎం దవాఖానాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం ప్రకటించిన ఎన్ఆర్ఐ వైద్యుడు డాక్టర్ సుజిత్ రెడ్డి పున్నం విషయాన్ని ముఖ్యమంత్రి కి ఎమ్మెల్యే నాయిని వివరించారు. వైద్య సేవల మెరుగుదలకు, మౌలిక వసతుల విస్తరణకు, ఆధునిక పరికరాల సమకూర్పుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయని తెలిపారు.డాక్టర్ సుజిత్ రెడ్డి కేఎంసీ పూర్వ విద్యార్థి కావడంతో పాటు హనుమకొండ వాసి ,విదేశాల్లో స్థిరపడినప్పటికీ సొంత గడ్డపై మమకారం చాటుతూ వైద్య రంగానికి చేయూత అందించడం అభినందనీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వగ్రామ అభివృద్ధికి ముందుకు వచ్చే ఎన్ఆర్ఐలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ సుజిత్ రెడ్డి ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించి అభినందించారు. వరంగల్ ప్రాంతంలో వైద్య సేవల స్థాయిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి , విష్ణు రెడ్డి, పాల్గొన్నారు.

