గ్రేటర్ న్యూస్, హనుమకొండ : కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అసత్య ప్రచారాలు చేస్తే సహించబోమని పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ…., కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించిందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రైతు రుణమాఫీ వంటి కీలక నిర్ణయాలను అమలు చేశామని తెలిపారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందన్నారు. ఇప్పుడు రెండేళ్లలోనే అమలు చేస్తున్న మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని అన్నారు.రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు.కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవసరమైతే ప్రజల ముందు ఓపెన్ చర్చకు సిద్ధమని, రైతులకు ఎవరు ఏమి చేశారో చర్చిద్దామని సవాల్ విసిరారు.రైతు రుణమాఫీ 80 శాతం పైగా పూర్తి చేశాం. ధాన్యం కొనుగోలు వ్యవస్థను మెరుగుపరచి రైతులకు న్యాయం చేస్తున్నాం అని తెలిపారు.గతంలో రైతులకు నకిలీ విత్తనాల సమస్యలు, కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.ఎయిర్పోర్ట్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు.ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు . నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వాగతిస్తాం కానీ అసత్య ప్రచారం, అవమానకర వ్యాఖ్యలు చేస్తే కఠినంగా ఎదుర్కొంటాం అని హెచ్చరించారు.ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, టీపీసీసీ నాయకులు, డీసీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

