ఓడిన చోటే గెలిచి చూపిద్దాం..కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కండి!

జూబ్లీహిల్స్ సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు…

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ :జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై చర్చించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్ లో కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దివంగత గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం, ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పడ్డ కష్టానికి మించి తాము పని చేస్తామని, “కాలికి బలపం కట్టుకొని తిరుగుతాం” అని కేటీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అక్రమాలకు పాల్పడ్డాయని కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారని, షేక్ పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేశారని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని, డబ్బు, మద్యం పంచి గెలిచారని, ఇది నైతిక గెలుపు కాదని విమర్శించారు. వ్యక్తిగత విషాదంలో ఉన్నా హరీష్ రావు పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని 407 బూతుల్లో ఒక్కో బూత్ కు 10 మంది చొప్పున, మొత్తం 4 వేల మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని, “ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి” అనే సామెతను గుర్తు చేస్తూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజల సమస్యలపై ఇప్పటి నుంచే పోరాటం మొదలుపెట్టాలని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ భవన్, పార్టీ కార్యాలయాలు కార్యకర్తలకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.


ఉపఎన్నిక టెక్నికల్‌గా కాంగ్రెస్ గెలిచినా.. నైతిక విజయం బీఆర్‌ఎస్‌దే

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్‌ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాటస్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18,000 ఓట్లు మాత్రమే వచ్చిన జూబ్లీహిల్స్‌లో, ఈ ఉపఎన్నికలో 75,000 ఓట్లు సాధించడం అనేది కార్యకర్తల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతికంగా గెలిచి ఉండవచ్చని, కానీ నైతిక విజయం మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతమ్మదేనని హరీశ్ రావు అన్నారు. మైనారిటీల మద్దతు కోల్పోతున్నామని గుర్తించిన కాంగ్రెస్, చివరి నిమిషంలో హడావుడిగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని గుర్తు చేశారు. ఇది బీఆర్‌ఎస్ పోరాట ఫలితమేనని వ్యాఖ్యానించారు. “అప్పుడప్పుడు అనైతిక విజయం, అధర్మం కూడా గెలుస్తూ ఉంటుంది. కానీ అంతిమ విజయం ధర్మానిదే” అని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లోనూ తాత్కాలికంగా ఓటమి ఎదురైనా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు గెలుపును అందించాయని గుర్తు చేశారు.
త్వరలోనే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని, తమను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేటీఆర్,తలసాని శ్రీనన్న సహా తామంతా కార్యకర్తలకు కుటుంబ సభ్యులుగా అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ, ఇతర ఎన్నికల కోసం కలిసి పనిచేసి మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు.


రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఉపఎన్నిక ఫలితాలపై అధైర్యపడొద్దు.

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

అధికార పార్టీ దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన్ని ప్రభావితం చేశాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, మార్కెట్లో డబ్బు లేకపోవడంతో పండుగల సమయంలో కూడా వ్యాపారం జరగట్లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ప్రజలు ‘ఆరు గ్యారెంటీలను 420 హామీలు’గా భావిస్తున్నారని, నిరుపేదలు తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రలోభాలకు గురయ్యారని అభిప్రాయపడ్డారు. రూ. 150 కోట్లు ఖర్చు పెట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికి ఈ ఎన్నికను గెలిచారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఫలితం ఓటమి కాదని, కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోడ్ల మీదకు తీసుకొచ్చామని తెలిపారు. రాబోయే రెండేళ్ల తర్వాత బలమైన ‘తుఫాను’ వస్తుందని, అప్పుడు కాంగ్రెస్ ఉనికి ఉండదని జోస్యం చెప్పారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండి, బూత్ కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *